రాష్ట్రంలో తమ పార్టీ అత్యంత బలంగా ఉందని, తమకు ఎవరూ సాటిరారని, అసలు పోటీనే లేరని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక స్ధానాలు గెలుచుకోవడం ద్వారా పూర్తి స్థాయి మెజారిటీ దక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ పార్టీకి ధీటుగా తట్టుకోవడంలోనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగతా పార్టీలు దక్కించుకోలేవని వ్యాఖ్యానించారు. చిరంజీవి సభకు తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సభలు పోటీగా నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి కంటే తమ పార్టీ సభలు నిర్వహించడానికి ముందుగానే కార్యక్రమాలు ఖరారు చేశామని, అయితే సోనియాగాంధీ పర్యటించే తేదీలు ఖరారు కావడంలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెలా రాష్ట్రంలో సోనియాగాంధీ రెండు మూడు జిల్లాల్లో పర్యటించే విధంగా కార్యక్రమం ఎప్పుడో నిర్ణయించామని ఆయన వివరించారు. మహిళా సాధికారిత కోసం తమ పార్టీ అగ్రాసనం వేసిందని, వారిలో మరింత ప్రేరణ కలిగించడానికే సోనియాగాంధీ రాష్ట్రంలో పర్యటనలు సాగిస్తున్నారని ఆయన వివరించారు. |