|
నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం:రఘువీరా |
|
|
|
రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పైర్లు, పంటలు గణాంకాలను ప్రభుత్వం సేకరిస్తోందన్నారు.
పరిహారాన్ని ఎకరాను పరిగణలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుందన్నారు. పంటల వారీగా ఏ పంటకు ఎంత ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. గత తెలుగుదేశం పార్టీ వేరుశెనగ, వరి తదితర పంటలకు రూ.500 ప్రకారం చెల్లించారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ. 1800 చెల్లించామన్నారు. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోంచి ఎరువులు ఆయా రాష్ట్రాలకు తరలి పోతున్నది వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎరువుల అక్రమ రావాణాదారులపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేశామని, ఇప్పటి వరకు బ్లాక్ మార్కెటింగ్ ఎరువులు తరలిస్తున్న వారిపై 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండి అక్రమంగా ఎరువులు తరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. |